
పొత్తులో భాగంగా జనసేన సీట్లపై(Janasena Seats) క్రమంగా స్పష్టత వస్తోంది. తాము 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక మూడు ఎంపీ సీట్లు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేసే విషయం అందరికి తెలిసిందే.
అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఐదు ఇప్పటికే ప్రకటించారు. అవి తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను మొన్న శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటించారు. రాజోలులో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు. అంటే ఇప్పటికి ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది.
Janasena Seats పై స్పష్టత
ఇక రెండు పార్టీల ఇంటర్నల్ సమాచారం ప్రకారం.. మిగిలిన 18 స్థానాల్లో మెజారిటీ సీట్లు(Janasena Seats) ఖరారయ్యాయి. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం లేదా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు.. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, భీమిలి, గాజువాక లేదా పెందుర్తి .. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దర్శి సీటు కోరగా తాజాగా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి ఇవ్వాలని కూడా కోరుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్నవాటిలో ఉన్నాయి.
వీటిలో కూడా అత్యధికంగా 14 స్థానాలను విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.