
టీడీపీ, జనసేన పొత్తుల మీద, సీట్ల లెక్కల మీద జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్కు(Pawan Kalyan) వరుసగా లేఖలు సంధిస్తున్న కాపు సంక్షేమ సేన(Kapu Sakshema Sena) నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య(Hari Ramajogaiah) మరో బహిరంగ లేఖ రాశారు. తాడేపల్లిగూడెం వేదికగా ఫిబ్రవరి 28న జెండా పేరుతో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించునున్నాయి. ఈ నేపథ్యంలో జెండా సభలో తేల్చాల్సినవి చాలా ఉన్నాయని హరిరామ జోగయ్య లేఖ రాశారు. బడుగు బలహీనవర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు.
Hari Ramajogaiah లేఖలోని అంశాలు
అయన రాసిన లేఖలో ఏముందంటే… “కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని, ఆనాడే వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పాడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలని, వారు పెద్దన్న పాత్ర వహించటం ద్వారా బడుగు బలహీనవర్గాల బానిస సంకెళ్ళను బద్దలుకొట్టి ఈ సామాజికవర్గాలకు విమోచనం కల్గించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట వాస్తవం. ఈ ప్రయత్నంలోనే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్యవర్గాలలో ఒకరైన వై.ఎస్.ఆర్ పార్టీ అధినేత జగన్ మోహనరెడ్డి అరాచిక పరిపాలనకు అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది” అని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను తీసుకుంటే.. రాజ్యాధికారం దిశగా కదులుతున్న పవన్ కళ్యాణ్ స్తానం కూటమిలో ఏమిటి, ఎక్కడ అనే మీమాంస బడుగు బలహీనవర్గాలలో తలెత్తుతోందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. వారు కోరుకుంటున్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే అంశం ప్రక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోందని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదనీ.. అలాగే వై.ఎస్.ఆర్ పార్టీని ఓడించటం అనే అంశానికి గండి పడటానికి వీల్లేదని లేఖలో ఆయన రాసుకొచ్చారు.
ఈ ప్రశ్నలకు తాడేపల్లి గూడెం సభ వేదికగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra Babu) సమాధానమివ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. చంద్రబాబు నుంచి అలాంటి ప్రకటన రాకపోతే వ్యక్తిగతంగా తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 29న ప్రకటిస్తానని హరిరామ జోగయ్య(Hari Ramajogaiah) స్పష్టం చేశారు
