
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి గా Madhavi Latha
లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ(BJP) 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా (BJP First List)ను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఒక పేరు మాత్రం అందరిలో ఆసక్తిని పెంచింది. ఆమె తెలియని వాళ్ళు ఆమె ఎవరా అని వెదకడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు కొంపెల్ల మాధవి లత, విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్(Kompella Madhavi Latha, Virinchi Hospitals Chairperson). ఆమె ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లోక్సభ స్థానంపై ఫోకస్ చేస్తోన్న బీజేపీ.. అక్కడి నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై ఓ మహిళను బరిలో నిలుపుతున్నారు. డాక్టర్ మాధవి లత (Madhavi Latha)ను హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించి, ఎంఐఎం కంచుకోటను బద్ధలుకొట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా వుంది. ఒవైసీ లాంటి రాజకీయ ఉద్దంఢుడిని ఢీ కొట్టడానికి ఓ మహిళా నేత మాధవి లతకు అవకాశం ఇవ్వడంతో ఎవరీమే అని చర్చ జరుగుతోంది.
ఇక తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగానూ 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల అధిష్టానం ప్రకటించింది. ఇందులో శుక్రవారం బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ పేరు ఉండటం విశేషం. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై పార్టీ మరోసారి నమ్మకం ఉంచింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు అదే స్థానం నుంచి బరిలో నిలుపుతోంది బీజేపీ.

ఇంతకీ Madhavi Latha ఎవరు ?
కోటి ఉమెన్స్ కాలేజ్ (Koti Womens College) నుండి పొలిటికల్ సైన్స్లో MA పట్టా పొందిన కొంపెల్ల మాధవీ లత విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ కూడా. ఎన్ఎసీసీ క్యాడెట్గా, క్లాసికల్ మ్యూజికల్ సింగర్గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దాంతోపాటు లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్లోని తన లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో పలు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు.
విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్గా, ఆమెకు ఇప్పటికే అపారమైన బాధ్యత ఉన్నప్పటికీ, ఆమె తన ముగ్గురు పిల్లలకు ఇంటి దగ్గరే చదువు నేర్పించారు(Home Schooling). ఆమె పెద్ద కుమార్తె ఐఐటి మద్రాస్లో బిటెక్ చదువుతోంది మరియు ఆమె కుమారుడు కూడా అదే యూనివర్శిటీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆమె చిన్న కుమార్తె కూడా తన తోబుట్టువుల అడుగుజాడల్లో నడుస్తోంది మరియు ప్రస్తుతం ఆమె 11వ తరగతి చదువుతోంది.
ముఖ్యంగా హింధూ ధర్మం, హిందూ సాంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలో ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇంతకీ Madhavi Latha ఒవైసీని ఢీకొట్ట గలరా?
ఈసారి మాధవీ లత ను పోటీకి నిలబెట్టి, 1984 నుంచి ఒవైసీల అడ్డా అయిన హైదరాబాద్ లో బీజేపీ గెలవగలదా? తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్. ఇక ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. అంతకు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి, విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవీ లతకు ఛాన్స్ ఇచ్చింది. ఆధ్యాత్మిక విషయాలు, సంస్కృతి, సాంప్రదాయాలపై తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పే మాధవీ లత ను, అసదుద్దీన్ పైన పోటీకి నిలపడంతో బీజేపీ ఎత్తుగడ స్పష్టం. మెజార్టీ ముస్లిం ఓట్లతో ఒవైసీలు ఎలా గెలుస్తున్నారో, దానికి విరుగుడుగా బీజేపీ ఈ వ్యూహం పన్నినట్లు గా వుంది. ఇది ఫలిస్తుందా లేదా అనేది ఎల్లెక్షన్స్ అయితే కానీ తెలియదు. ప్రస్తుతానికి ఇది మాంచి ఎత్తుగడలానే వుంది.