
Janasainiks fight over poor sanitation..
రేపల్లె(Repalle) పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన రహదారితో పాటు, కళాశాలు, విద్యాసంస్థలకు వెళ్ళు రహదారుల వెంట కుళ్ళిపోయిన, కంపు కొడుతున్న చెత్తకుండీలు స్వాగతం పలుకుతున్నాయని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఆరోపించారు. పట్టణంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై జనసేన(Janasena), టిడిపి(TDP), బిజెపి(BJP) పార్టీల ఆధ్వర్యంలో 28 వార్డుల్లో పర్యటించారు. ఈ మేరకు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి దోమల నియంత్రణ చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కుండీలు చెత్తతో నిండిపోయి రోడ్లపై సగ భాగానికి పైగా పేరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయని అన్నారు. అధికార పార్టీ పురపాలకులు పారిశుద్యాన్ని గాలికి వదిలేసారని విమర్శించారు. పట్టణంలోని 28 వార్డుల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందన్నారు. దుర్గంధంతో పాటు ఈగల మాదిరిగా దోమలు ఇంటా, బయటా ఎక్కడ నిలబడినా గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. గతంలోఎన్నడూ లేని విధంగా పురపాలకసంఘంలో దోమలు బెంబేలెత్తిస్తున్నా పాలకులు దోమల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం సిగ్గుచేటు అన్నారు.
సిద్ధం సభల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు పట్టణాభివృద్ది, ప్రజారోగ్యం కొరకు ఏ మాత్రం శ్రద్ధ కనపర్చక పోవటం విచారకరమన్నారు. గతంలో పారిశుద్య కార్మికులు ప్రతి రోజు డ్రైనేజీలలో పేరుకు పోయిన మురుగును తొలగించేవారని ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం వలన డ్రైనేజీలలో మురుగు పేరుకు పోయిందన్నారు. గతంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి వార్డులో వారానికి రెండు పర్యాయములు ఫాగింగ్ చేసేవారని, ప్రస్తుత పాలకులు వచ్చినప్పటి నుండి ఫాగింగ్ అనేది లేకపోవటంతో దోమలు ఈగల్లా మారి ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయని అన్నారు.


అనంతరం పట్టణ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతూ పురపాలక సంఘ కమిషనర్ శేషాద్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనసైనికులు(Janasainiks), టిడిపి, బిజెపి పార్టీల నాయకులు మెండు సుబ్బారావు, గరికపాటి గిరిధర్, దేవగిరి శంకర్, మలిశెట్టి సాయి, సురేష్, కే వంశీకృష్ణ, తోట లంకేష్, ఉపేంద్ర, రేపల్లె ఉషాద్రి, సాయి, మహేష్, రవి కందుల నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist