
జగన్ గంజాయి, ఇసుక, మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తున్నారు -Nara Lokesh
మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్(Jagan) గంజాయి, ఇసుక, మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తున్నారు… నన్ను మంగళగిరి(Mangalagiri) లో ఓడించేందుకు రూ.300 కోట్లు పంపించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసిపి(YCP) కుట్రలను తిప్పికొట్టాలి, మాయమాటలకు మోసపోవద్దని నారా లోకేష్(Nara Lokesh) విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టిడిపి(TDP) ప్రభుత్వం వస్తే పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు రద్దుచేస్తామని వైసిపి పేటిఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, రాబోయే ప్రజా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందజేస్తామని యువనేత నారా లోకేష్(Nara Lokesh) స్పష్టంచేశారు.
రాష్ట్రంలో పెన్షన్ మొదట ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్. 2014కు ముందు రూ.200 ఉన్న పెన్షన్ ను చంద్రబాబునాయుడు రూ.2వేలు చేశారు. అన్న క్యాంటీన్లు, పసుపు కుంకుమ, పెళ్లికానుకలు, చంద్రన్న బీమా వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మాపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు.


ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికల సమయంలో కనిపించారు. ఎక్కడ ఇళ్ల పట్టాలు అడుగుతారేమోనని తప్పించుకుని తిరిగి మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నారు. ఆర్కేను రెండుసార్లు గెలిపించారు. ఇప్పుడు కొత్తగా ఒక చెల్లెమ్మను తీసుకువచ్చారు. గెలిచినోడు నేను చేసిన దాంట్లో పదిశాతం కూడా చేయలేదు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ గెలిస్తే ఇళ్లు తీసేస్తారని ఆనాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఇళ్లు ఎవరు తొలగించారు? ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లు జగన్ అన్యాయంగా తొలగించారు.
జగన్ సొంత బాబాయిని చంపిన వారిని కాపాడుతున్నారు. తల్లి, చెల్లిని గెంటేశారు. జగన్ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మోసం చేశారు. పేదలకు పట్టాలిస్తానని చెప్పి మాటతప్పడమేగాక వారి ఇళ్లు కూల్చేశారు. ఇటువంటి వ్యక్తిని సైకోగాక మరేమనాలి?వైసిపి పాలనలో గంజాయి ప్రతి గడపను తాకింది. దీనివల్ల ఒక తరం నాశనమవుతోంది. నిన్న డోలాస్ నగర్ లో ఓ తల్లి.. తన పిల్లలు గంజాయికి బానిసయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది.


చిత్తూరులో కూడా ఓ తల్లి.. తన పెద్ద కూతురు గంజాయికి బానిసైందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గంజాయి విజృంభణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే కారణం. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అనంతబాబు. అలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి తన పక్కన కూర్చోపెట్టుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.
అమరావతి అభివృద్ధితో ఉద్యోగాల కల్పన. అమరావతి కొనసాగి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు. ఆనాడు కట్టుబట్టలతో వచ్చి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమరావతిని రాజధానిగా చేసుకున్నాం. చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేదంటూ అమరావతికి జగన్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశారు. అమరావతి రైతులు, మహిళలను బూటుకాళ్లతో తన్నారు. కరకట్ట కమల్ హాసన్ రాజధాని ఇక్కడే ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు ఓటేశారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు తీసుకువస్తానని, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదానికి కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగాలు కల్పిస్తాం.
రాబోయే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలో పేదరికాన్ని నిర్మూలిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. మంగళగిరిలో నిరుపేదలకు 20వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. ఎన్టీఆర్ కట్ట వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల పెన్షన్ పెంచాలని, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని కోరారు.
టీడీపీ హయాంలో ఏనాడు కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్ను ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. నేడు జగన్ రెడ్డి అన్ని రకాలుగా బాదుడే బాదుడు. టీడీపీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ అడ్డగోలుగా పెంచిన విద్యుత్, పన్నుల భారాన్ని సమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని నారా లోకేష్(Nara Lokesh) భరోసా ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాలేజీలకే ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు చెల్లించాం. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బకాయిలతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందని పరిస్థితి. పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానం తీసుకువస్తాం, విద్యార్థులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తాం.పేదలకు విద్యను దూరం చేసే ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం జీవో 117ను రద్దు చేస్తాం.
ప్రాతూరు వాసులు పలు సమస్యలను నారా లోకేష్(Nara Lokesh) దృష్టికి తెస్తూ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. స్మశాన వాటికను అభివృద్ధి చేయడంతో పాటు ప్రహరీగోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్పోరేషన్ వల్ల పెరిగిన పన్నుల భారం తగ్గించాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని నారా లోకేష్(Nara Lokesh) హామీ ఇచ్చారు.
-By Guduru Ramesh Sr. Journalist