
రేపల్లెలో(Repalle) జోరుగా YSRCP ప్రచారం
రేపల్లె: రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయుధాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, నియోజకవర్గ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్ అడపా శేషు, మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జున రావు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గణేష్, పేటేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కనపర్తి రవికిరణ్, వైస్ ఎంపీపీ రావు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బుధవారం పేటేరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
తొలుత గుండెపాటమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. పేటేరు ఒకటవ వార్డు నేతన్నల బజారు నుండి ప్రారంభమైన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు నాయకులకు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. చేనేత బజారు నుండి ఇందిరా కాలనీ, ఆంజనేయ స్వామి కాలనీ, శ్రామిక నగర్, గౌడ పాలెం, ఆరేపల్లి బజార్, గుంటూరు వారి పాలెం, యాదవుపాలెం, వాకా వారి బజారు, తూర్పు మాలపల్లి తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో వాలంటరీల సేవలను గుర్తించకుండా ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతూ విధుల నుంచి తప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పింఛన్లు అందించే వాలంటరీల పట్ల చంద్రబాబు నాయుడు ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను సేవలు ఆపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వ తాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist