
దూరదర్శన్ లో తెలుగు వార్తలు చెప్పిన మొదటి వ్యక్తి Shanthi Swaroop ఇక లేరు!
శాంతి స్వరూప్ గారు ఈ రోజు ఉదయం కాలం చేశారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో నగరం లోని యశోద హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూసారు.
శాంతి స్వరూప్ గారి గురించి కొన్ని విశేషాలు
శాంతి స్వరూప్(Shanthi Swaroop) ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్(Doordarshan) లో తొలి తెలుగు యాంకర్(First Telugu Anchor), అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి(First Telugu news Reader in TV). భాషా స్పష్టత, హావభావ వ్యక్తీకరణ, నిండుతనము ఆయన స్వంతం.
హైదరాబాద్(Hyderabad) లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్(Shanthi Swaroop) గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో తన సహ సీనియర్ యాంకర్ రోజా రాణి(Roja Rani) ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ లో చదివి ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డారు.


నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు ప్రారంభించారు… తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అది అప్పట్లో ఒక సంచలనం. వాటిని అప్పుడు లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్ గారు. జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు ఆయన. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు.
ఆయన వృత్తి రీత్యా 1977 అక్టోబర్ 23 లోనే హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్(Shanthi Swaroop) తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్లు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. “తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలని ఆయన అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వుండే వారు.
తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్(Shanthi Swaroop) ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. “వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి….,”అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతూ ఉండేవారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటుండే వారు.