
బాపట్ల జిల్లా (పాత గుంటూరు జిల్లా) రేపల్లెలో(Repalle) నిన్న సాయంత్రం (04-05-2024) నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రసంగించారు.
“గత ఎన్నికలలో జరిగిన ఓటమి జనసేనను(Janasena) మరింత బలపడేలా చేసింది.. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోసింది. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురుతిరగాలనిపిస్తుంది. నేను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను.. దేశ ఐక్యతకు భంగం కలగనివ్వను. రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తకపోతే ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు. భయపడితే సమాజంలో అభివృద్ధి జరగదు.”
“గులకరాయి పడితేనే జగన్ ఇంత పెద్ద డ్రామా ఆడారు. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై దాడి జరిగితే నిందితులకు ఇప్పటి వరకూ శిక్ష పడలేదు. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత నిర్లక్ష్యంగా మాట్లాడారు. మా అక్కను వేధించొద్దు అన్నందుకు అమర్నాథ్గౌడ్ అనే బాలుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. బాధ్యత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. బలవంతులపై చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి.. బలహీనులపై చాలా బలంగా పనిచేస్తాయి. అమర్నాథ్ విషయంలో ఇదే జరిగింది. రేపల్లెను జూద స్థావరంగా మార్చారు. 95 చ.కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తుఫానుల నుంచి కాపాడే మడ అడవులను నాశనం చేశారు. మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి లేదు” అని పవన్ వ్యాఖ్యానించారు.
Land Titling Act పై పవన్ కల్యాణ్
ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’(Land Titling Act) ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టేనని, మన ఆస్తులపై రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, తేలాల్సింది మెజార్టీ మాత్రమేనని, ఆయన వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం పెడతామని, రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం బలమైన యాక్ట్ను తీసుకొస్తామని, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడతామని, నిజాంపట్నం పోర్టును అభివృద్ధి చేసి.. యువతకు ఉపాధి కల్పిస్తామని, పవన్ హామీ ఇచ్చారు.
-By VVA Prasad