
రేపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర(Aadudam Andhra) క్రీడాకారులు ప్రైజ్ మనీ కోసం మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది.
వివరాల ప్రకారం నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర(Aadudam Andhra) క్రీడా పోటీలను రేపల్లె పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు షటిల్, బాల్ బ్యాట్మెంటన్, కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు. అయితే క్రీడలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆడియన్స్ కు, క్రీడాకారులుకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. కూర్చోవడానికి గ్యాలరీలు లేవు, తాగటానికి నీళ్లు లేవు, క్రీడాకారులకు క్రీడా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయలేదు. అయినా క్రీడల పై ఉన్న మక్కువతో చాలా మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు.
Aadudam Andhra: ప్రైజ్ మనీని అకౌంట్లలో వేస్తారంట!
ఇదంతా ఒక ఎత్తైతే, ఆఖరికి ప్రైజ్ మనీ కింద ప్రభుత్వం ప్రకటించిన నగదు అందించడంలో అధికారులు చేతులెత్తేశారు. నిజాంపట్నం మండలానికి చెందిన వాలీబాల్, కబాడీ క్రీడల జట్లకు ప్రాతినిధ్య వహించిన శ్రీనివాసరావు, శేషగిరి అనే క్రీడాకారులు తమ జట్టులతో విశేష ప్రతిభ కనబరిచి ప్రధమ, ద్వితీయ స్థానాలను సాధించారు. ముందుగా ప్రకటించిన విధంగా క్రీడాకారులకు మొదటి బహుమతిగా రూ.35వేలు, రెండవ బహుమతిగా రూ.15 వేలు, మూడో బహుమతి రూ 5 వేల రూపాయలను ప్రకటించిన అధికారులు క్రీడలు ముగిసిన అనంతరం క్రీడాకారులకు మెమొంటోలు, సర్టిఫికెట్లు మాత్రమే ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రైజ్ మనీ కొరకు తమ అకౌంట్లు ఇవ్వాలని సూచించడంతో సదరు క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి పోటీలలో పాల్గొనేందుకు రేపల్లె రావటం, వెళ్ళటం భోజన ఖర్చులు వగైరా కలుపుకొని ఒక్కొక్క క్రీడాకారుడికి 6 నుంచి 7వేల రూపాయలు ఖర్చులయ్యాయని వాపోయారు. కనీసం ప్రైజ్ మనీ ఇచ్చిన వాటితో సంతోషపడేవారుమని అవేమీ లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చి జిల్లా జట్లకు వెళ్లాలని చెప్పటం బాధాకరమన్నారు. ఈ విషయంపై మండల పరిషత్ అధికారి శివ పార్వతిని వివరణ కోరగా క్రీడల నిర్వహణకు ప్రభుత్వం కేవలం 25 వేల రూపాయలు మాత్రమే కేటాయించారని చెప్పారు. ఉన్నతాధికారులు చెప్పిన మేరకు ప్రైజ్ మనీని అకౌంట్లలో వేస్తామని క్రీడాకారులకు చెప్పామన్నారు. దీంతో క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారని, తామేమి చేయలేమని చెప్పారు.

గెలుపొందిన క్రీడాకారులు మాట్లాడుతూ నియోజకవర్గస్థాయి ప్రైజ్ మనీనే తీసుకోలేకపోతున్నాం, ఇక జిల్లా స్థాయికి వెళ్లి ఎక్కడ తీసుకుంటాం. మండల స్థాయి అధికారులతోనే మాట్లాడలేని మేము జిల్లా అధికారులతో ఏం మాట్లాడతామని అసహనం వ్యక్తం చేశారు.
-By Guduru Ramesh Sr. Journalist