
ఈ నెల 30 నుంచి Pawan Election Campaign
Pawan Election Campaign: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాను పోటీ చేయబోయే పిఠాపురం (Pithapuram) నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని.. అందుకు అనుగుణంగానే తన పర్యటన షెడ్యూల్ రూపొందించాలని సోమవారం నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించబోతున్నారు.
ఈ నెల 30న పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం(Pawan Election Campaign) ప్రారంభం.. 3 రోజులు ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. ఇక అదే రోజు శ్రీపాద వల్లభుని దర్శించుకోనున్నారు. తరువాత రోజు అంటే 31న ఉప్పాడ సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 1న పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోనే మేథావులతో సమావేశం కానున్నారు.
ఇక ఈ పర్యటనలో భాగంగానే టీడీపీ, బీజేపీ నేతలతోనూ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచే ఇతర నియోజకవర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో సహా సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారు. ఉగాది వేడుకలు సైతం జనసేనాని పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారని చెబుతున్నారు.
30వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రారంభం
— JanaSena Party (@JanaSenaParty) March 25, 2024
పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం
పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు pic.twitter.com/RgvkK2lfEC