
MP Balasouri Quits YCP
మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వల్లభనేని YCP కి రాజీనామా చేశారు. వైసీపీకి లేఖ ద్వారా రాజీనామా సమర్పించారు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ గా బాలసౌరి 60,000 ఓట్లతో గెలుపొందారు. అయితే ఈసారి జగన్ ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడమే పార్టీని వీడేందుకు కారణమని తెలుస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు హడావుడిగా రాజీనామాలు చేయడం చూస్తుంటాం. అయితే ఈసారి వైసీపీ ఎంపీలను కూడా అనూహ్యంగా కోల్పోతుంది.
MP Balasouri సీఎం జగన్ కు సన్నిహితుడుగా పేరుంది. వ్యాపార భాగస్వామిగా ప్రచారం కూడా ఉంది. ఇటీవల Telangana ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో విందు ఇచ్చారు. ఈ విందుకు వెళ్లిన వారిలో బాలశౌరి కూడా ఉన్నారు. తనకు చెప్పకుండా వెళ్లినందుకు జగన్ ఎంపీలపై మండిపడ్డారని టాక్. తర్వాత మచిలీపట్నం టిక్కెట్ కోసం ఇతరుల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారని అనుకుంటున్నారు.
MP Balasouri: రాజకీయ ప్రస్తానం
వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, వైఎస్ హయాంలో 2004లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత రాజకీయ పరిణామాల వల్ల అక్టోబర్ 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ గా బాలసౌరి 60,000 ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
MP Balasouri పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను ఇప్పటికే రహస్యంగా కలిశారని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం పవన్ తో భేటీ జరిగిందని జనసేన(Janasena)లో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక ఆయన రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉందిని అంటున్నారు. ప్రస్తుతానికి బాలశౌరి ఎవరికీ అందుబాటులో లేరు. ఈ అంశంపై ఆయన రేపో మాపో స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.