
MP Mopidevi slams TDP
రేపల్లె(Repalle) : నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ధన రాజకీయాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ(MP Mopidevi Venkata Ramana) ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని 23వ వార్డులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మోపిదేవి(MP Mopidevi) మట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ ఇతర పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్యాకేజీలు ఇచ్చి, ప్రలోభాలకు గురి చేయటం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. పది మందిని మాట్లాడుకోవడం, ప్యాకేజీలు ఇవ్వడం, పార్టీలోనికి భారీగా వలసలు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప టీడీపీకి నైతిక విలువలు లేవన్నారు. అభివృద్ధి, కమిట్మెంట్ తో సంబంధం లేకుండా నాయకుడు, కార్యకర్త అనే గౌరవ మర్యాదలు లేకుండా ఎవరినైనా డబ్బుతో కొనవచ్చు అనే అహంభావంతో టిడిపి నాయకులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
2019 ఎన్నికల తర్వాత కొందరు టిడిపి సానుభూతిపరులు వారి స్వార్థం కోసం వైసీపీ పంచన చేరారని గుర్తు చేశారు. వారి పనులు చేయించుకోవడానికి వచ్చిన కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి వైసీపీ నుండి టిడిపిలో చేరారని ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వారు వైసీపీలో బలమైన నాయకులు కాదని, గొప్ప నాయకులు అంతకంటే కాదని, ప్యాకేజీ బ్యాచ్ అని ఎద్దేవ చేశారు. వారేదో వైసీపీకి వెన్నుముకంటూ టిడిపి గ్లోబల్ ప్రచారం చేయటం సరికాదన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న వాళ్ళు ఎవరు పార్టీ మారెందుకు సిద్ధంగా లేరని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం గౌరవ మర్యాదలు వైసీపీ పార్టీలోనే ఉంటాయన్నారు.
నియోజకవర్గంలో వైసీపీ(YCP) ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అలాంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరించారు. కమిట్మెంట్ తో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తేనే ప్రజలు స్వాగతిస్తారని హితవు పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. లక్షసాధనలో 175 కి 175 టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారని అన్నారు. రేపల్లె నియోజకవర్గం 175లో మొదటి స్థానంలో నిలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.



పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఊపందుకుంది.
సంక్షేమ పథకాలే ఆయుధాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 23వ వార్డులో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి(MP Mopidevi) మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి వైసీపీ నాయకులను కార్యకర్తలను రాష్ట్ర ప్రజానీకాన్ని సిద్ధం సభల ద్వారా సిద్ధం చేశారా అన్నారు. 23వ వార్డులొ కూలి నాలి చేసుకొని జీవనం సాగించే చిన్న చిన్న కుటుంబాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని ఈ వార్డు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులకు అత్యధిక మెజారిటీ వస్తుందని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గణేష్ ను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిమట బాలాజీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జున రావు, యువ నాయకులు మోపిదేవి రాజీవ్ పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist