
Welfare CM Jagan
రేపల్లె(Repalle) : పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ సారధిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి(Welfare CM Jagan) ప్రజల మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు.
పట్టణంలోని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవాడు తమ కాళ్ళపై తాను నిలబడే విధంగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. మే 13న రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని(Jagan Mohan Reddy) రెండవసారి ముఖ్యమంత్రి చేయాలని ఆశయంతో ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రేపల్లె శాసనసభ్యులుగా డాక్టర్ గణేష్, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగామ సురేష్ ను నియమించడం జరిగిందని తెలిపారు. వీరి ఇరువురి ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి తాను ఒంటరిగా ఎన్నికలకు వస్తానని చెప్పటం తో పాటు నేను మంచి చేశాను అని అనిపిస్తేనే ఓటు వేయండని ప్రజలకు సూచిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడని కొనియాడారు. చంద్రబాబు తన జీవితకాలంలో ఏనాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవని ఎద్దేవ చేశారు. మొదటినుంచి ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకున్న నైజం చంద్రబాబుదే నన్నారు. ప్రస్తుతం జనసేన, బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుందని చెప్పారు.
రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాలంటరీలపై ప్రతిపక్ష పార్టీలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. వాలంటరీల ద్వారా ఏదో జరిగిపోతుందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడంతో వారి సేవలను పక్కన పెట్టారని తెలిపారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఇలాంటి పనుల వల్ల రాష్ట్రంలో పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
అనంతరం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా చెప్పిన ప్రతి మాటను అమలు చేసి 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు. మరల ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని విషయం ప్రజలు గమనించారని గుర్తు చేశారు. గతంలో 151 యొక్క స్థానాల్లో విజయం సాధించగా నేటి సార్వత్రిక ఎన్నికల్లో 175/ 175 స్థానాలు సాధించేందుకు వైసీపీ సిద్ధమన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న పిచ్చి మాటలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం ఇందుకు నిదర్శనం అన్నారు. నియోజకవర్గంలో గణేష్ ను, పార్లమెంట్ అభ్యర్థి నందిగాం సురేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడపా శేషు, నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ గాదే మధుసూదన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గణేష్ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist