
పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం శాసన సహిత శిలా విగ్రహం లభ్యం!
పోతురాజు స్వామి దేవాలయ(Pothuraju Swami Temple) పునర్నిర్మాణ క్రమంలో వెలుగు చూసిన విగ్రహం ప్రాచీనత. విగ్రహంపై ప్రాచీన లిపి(Ancient script) చూసి పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లిన నాదెళ్ల శివరామకృష్ణ, ప్రభుత్వ అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి.
భారతదేశ గొప్పతనం, కీర్తి ప్రతిష్టలను మాటల్లో చెప్పలేం. మన దేశ గొప్పతనాన్ని, చరిత్రను తెలియజేస్తూ, బౌద్ధుల కాలం నాటి ప్రాచీన విగ్రహాలు, రాజుల కాలం నాటి పరాక్రమాల విగ్రహాలు, అప్పటి పరిస్థితులకు నిదర్శనంగా నిలిచే శాసనాలు, శిలాఫలకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పటికీ అరుదైన, గొప్ప గొప్ప శాసనాలు(Inscriptions), అరుదైన శిల్పాలు(sculptures) బయల్పడుతూనే ఉన్నాయి.
తాజాగా కృష్ణా జిల్లా(Krishna District) పురిటిగడ్డ(Puritigadda)లో కూడా ఒక అరుదైన ప్రాకృత శాసనం ఒకటి లభించింది. అది ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటిది అంటున్న పురావస్తు శాస్త్రవేత్తలు. చల్లపల్లి(Challapalli) మండలం పురిటిగడ్డలో పురాతన విగ్రహాన్ని గుర్తించారు. గ్రామంలోని పోతురాజు స్వామి ఆలయం పునర్ నిర్మాణం చేపట్టిన గ్రామ పెద్దలు పాత ఆలయాన్ని తొలగించే క్రమంలో ఆలయంలోని ఏడు అడుగుల పొడవైన విగ్రహాన్ని పీఠం నుంచి బయటకు తీశారు. విగ్రహం శుభ్రంగా కడిగి అధివాసంలో ఉంచారు. పురిటిగడ్డ కృష్ణసాయి మందిర నిర్మాత, మేనేజింగ్ ట్రస్టీ, గ్రామ ప్రముఖులు, పోతురాజు స్వామి దేవాలయ పునర్ నిర్మాణ కమిటీ పెద్దలు నాదెళ్ల శివరామకృష్ణ, పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్ ప్లస్ అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే విగ్రహానికి ఒక పక్కన ప్రాచీన లిపి కనిపించింది. దీంతో వెంటనే ఈ విగ్రహం ఫోటోలను పురావస్తు శాఖ నిపుణులు ఈమని శివ నాగిరెడ్డికి పరిశీలన కోసం పంపించారు.
విగ్రహం రూపురేఖలు, విగ్రహంపై ఉన్న ప్రాచీన లిపి గమనించిన శివ నాగిరెడ్డి మూడవ శతాబ్దం నాటి విగ్రహం అయి ఉండవచ్చని, త్వరలో పురావస్తు అధికారులతో కలిసి పురిటిగడ్డ వచ్చి విగ్రహం పరిశీలిస్తామని తెలిపారని నాదెళ్ల శివరామకృష్ణ తెలిపారు. కాగా విగ్రహాన్ని దాని వెనుక ఉన్న శాసనాన్ని పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ విభాగం సంచాలకులు కె.మునిరత్నంరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనం చాలా పురాతనమైనదిగా ప్రకటించారు. ఆ విగ్రహం ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటిది అని స్పష్టం చేశారు. అలాగే ఆ విగ్రహం వెనుక ఉన్న పదాలు బ్రహ్మి లిపిలో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆనందుడు అనే బౌద్ధాచార్యుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన వివరాలు ఆ విగ్రహం వెనుక రాసి ఉన్నట్లు తెలిపారు. అయితే విగ్రహం పగిలి ఉండటం వల్ల కొన్ని అక్షరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని వ్యాఖ్యానించారు.
పల్నాటి ప్రాంతానికి చెందిన సున్నపురాతి విగ్రహంపై ఒకవైపు పోతురాజు విగ్రహం ఉంది. మరోవైపు బ్రహ్మి లిపిలో ప్రతిష్టించిన వివరాలు ఉన్నాయి. అలాగే మరోవైపు బిడ్డను పట్టుకున్న ఒక తల్లి రూపం ఉందని శివనాగిరెడ్డి వెల్లడించారు. మన చరిత్రను, మన నేల గొప్పతనాన్ని తెలియజేసే శాసనాలు, విగ్రహాలను భద్రపరుచుకోవాలని శివనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. మన భవిష్యత్ తరాలకు మన చరిత్రను తెలియజేసుందుకు ఈ విగ్రహం ప్రతిబింబాన్ని ఆలయం వద్ద ప్రదర్శించి.. వారికి తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు. పురిటిగడ్డ గ్రామంలోని పోతురాజు విగ్రహం ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటిదని తెలుసుకుని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-By Guduru Ramesh Sr. Journalist