
రోడ్లపై గుంటలను(Potholes) పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో YCP ప్రభుత్వం
రేపల్లె: రోడ్లపై గుంటలు(Potholes) పూడ్చటం చేతగాని వారికి ఓట్లను అడిగే హక్కు లేదని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్(Rasamsetti Mahesh) విమర్శించారు. పట్టణంలోని అంకమ్మ చెట్టు మూడు రోడ్ల కూడలి వద్ద ఉన్న మురికి గుంతను బాగుచెయ్యాలని కోరుతూ టిడిపి(TDP), జనసేన(Janasena), బిజెపి(BJP) శ్రేణులు సోమవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాసంశెట్టి మహేష్ మాట్లాడుతూ రేపల్లె పట్టణ ప్రవేశ మార్గంలో గత ఆరు నెలలు మూడు రోడ్ల కూడలి మధ్యలో మురికి గుంట ఉండటం సిగ్గుచేటు అన్నారు.
మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కొనిజేటి రోశయ్య విగ్రహాల సాక్షిగా నిత్యము రద్దీగా ఉండే మూడు రోడ్ల ప్రధాన రహదారిపై మురికి గుంట ఉండటం దౌర్భాగ్యం అన్నారు. పేటేరు, అవనిగడ్డ ఆరవపల్లి నుండి నిత్యము వాహన చోదకులు ప్రయాణికులు సంచరించే ఈ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంటను పూడ్చలేని అధికార పార్టీ నాయకులు ఓట్ల కోసం తిరగటం విచారకరమన్నారు. ఆరు నెలలు గా గుంటను పూడ్చలేని నాయకులు అధికారం వస్తే ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కనీసం రోడ్లపై గుంటలను(Potholes) కూడా పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని అన్నారు .

ఈ విషయంపై ఆర్ అండ్ బి అధికారులను సంప్రదిస్తే మున్సిపాలిటీ వారిని సంప్రదించాలని ఒకరిపై ఒకరు చెప్పటం తప్ప సమస్యను పరిష్కరించలేదని ఆగ్రహించారు. 2014-18 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ఆధ్వర్యంలో రేపల్లె(Repalle) నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామాలలో సైతం రోడ్లను వేసి అభివృద్ధి పరిచిన ఘనత అనగాని సత్యప్రసాద్ కి చెందుతుందన్నారు.
రేపల్లె-చెరుకుపల్లి, రేపల్లె-నిజాంపట్నం రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత అనగానిదే అన్నారు. వైసీపీ(YCP) ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగళ్ల సుబ్రహ్మణ్యం, సురేష్, భాషా, జనసేన నాయకులు సాయి పృథ్వి, బిజెపి నాయకులు వెంకటేశ్వరరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist