
ఇండియాలో త్వరలో Air Taxi Services
న్యూ ఢిల్లీ: ట్రాఫిక్ సమస్యల బారిన పడకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు మరో రెండేళ్లలో ఇండియాలో(India) ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలు(All-electric Air Taxi Services) అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా భారతదేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి.
ఇవి చూడటానికి హెలికాప్టర్ల మాదిరిగానే ఉన్నా సురక్షితమైనవి మరియు తక్కువ శబ్దం ఉత్పత్తి చేస్తాయి. పైలట్ తో పాటు నలుగురు వ్యక్తులు కూర్చునే ఈ ట్యాక్సీలో గంటకు 161 కిలోమీటర్ల వేగంతో ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రయాణించవచ్చు. సాధరణంగా ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానా లోని గురుగ్రామ్ మధ్య షుమారు 30 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం టాక్సీలో 90 నిమిషాల సమయం పడుతుండగా… 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది. కాగా ఇదే దూరానికి ఈ ఎయిర్ ట్యాక్సీ వల్ల కేవలం 7 నిమిషాల్లో షుమారు 2,000 నుంచి 3,000 ఖర్చు తో చేరుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆరు బ్యాటరీలను కలిగి ఉండే ఈ ఎయిర్ టాక్సీ 30-40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని, ఒక నిమిషం ఛార్జ్ చేస్తే అది ఒక నిమిషం ఎగరటానికి ఉపయోగపడుతుందని దాని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిఖిల్ గోయెల్ తెలిపారు.
ఎయిర్ ట్యాక్సీ ధ్రువీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని, 2025 నాటికి సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆగమ్ గోల్డ్ స్టెయిన్ తెలిపాడు. సర్టిఫికేషన్ పూర్తి అయ్యాక ఇండియాలోనే అత్యంత రద్దీ నగరాలైన ఢిల్లీ తో పాటు ముంబయ్, బెంగళూరు నగరాలలో కూడా 200 ఎయిర్ ట్యాక్సీలతో సేవలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
-By VVA Prasad