అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది…
రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది..
12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట
84 సెకండ్ల పాటు సాగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
నవ నిర్మిత రామ మందిరంలో నీల మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది…
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం అంతరంగంలో పులకించిపోయారు…
అయోధ్య నగరమంతా రామ నామంతో మార్మోగింది…
ఈ మహత్కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7వేల మంది విచ్చేశారు..
రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా తిలకించి పులకించిపోయారు…
అయోధ్య నగరమంతా రామ్ లీలా, భగవద్గీత కథలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది…

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony
భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మధుర క్షణం రానే వచ్చింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణప్రతిష్ఠ(Pran Pratishtha) అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi ) చేతుల మీదుగా బాలరాముడి ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఐదు శతాబ్దాల చిరకాల స్వప్నం సాకరమైంది.
సరిగ్గా అభిజిత్ లగ్నంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకెన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకెన్ల మధ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ(Pran Pratishtha) జరిపించారు. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు నిర్వహించారు. క్రతువు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు, రుత్విజుల ఆధ్వర్యంలో జరిగింది. గర్బాలయంలోని బాల రాముడికి ప్రధాని తొలిపూజ చేసి.. దర్శించుకున్నారు. వేద పండితులు మోదీతో పూజలు చేయించారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది.

బాల రాముడి విగ్రహం జీవకళతో ఉట్టిపడుతోంది. బాలరాముడి దివ్యమనోహర రూపం చూపుతిప్పుకోని విధంగా ఉంది. చిరు దరహాసం, ప్రసన్న వదనం, పసిడి కిరీటం, స్వర్ణాభరణాలతో బాల రాముడు దర్శనమిచ్చారు. ఎడమ చేతిలో బాణం, కుడి చేతిలో విల్లుంబు ధరించి ముగ్ద మనోహరం రూపుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి దర్శనంతో యావత్ భారతావని పులకించింది. పూజ అనంతరం అయోధ్య రాముడికి ప్రధాని దీప హారతి ఇచ్చారు.
అంతకు ముందు మందిరంపై వాయుసేన హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. అయోధ్య నగరం రామనామంతో మారుమోగింది. ఇక గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన సంగతి తెలిసిందే.
-By Guduru Ramesh Sr. Journalist