
MDH and Everest మసాలా పొడులలో క్యాన్సర్ కారకాలు!
ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఐన MDH మరియు ఎవరెస్ట్(MDH and Everest)లకు చెందిన నాలుగు రకాల మసాలా పొడులలో క్యాన్సర్ కు కారణమయ్యే(Carcinogens) ఇథిలీన్ ఆక్సైడ్ అని పిలువబడే రసాయనం ఉన్నట్లు గుర్తించిన హాంకాంగ్ కు చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (CFS) ఈ ఉత్పత్తుల విక్రయాలను హాంకాంగ్ లో నిషేధించింది.
ఈ ఉత్పత్తులు – MDH కి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా మరియు ఎవరెస్ట్ కి చెందిన ఫిష్ కర్రీ మసాలా. దీనిని అనుసరించి, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) కూడా ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను నిషేధించింది.
ఈ నేపథ్యంలో.. ముందుజాగ్రత్త చర్యలను చేపట్టే దిశగా కేంద్ర సర్కారు కూడా నడుం బిగించింది. మనదేశంలోని అన్ని మసాలా ఉత్పత్తులకు సంబంధించిన శాంపిళ్లను సేకరించాలని సంబంధిత ఫుడ్ కమిషనర్లు అందరినీ అప్రమత్తం చేసింది.
ఇప్పటికే అన్ని కంపెనీలకు చెందిన మసాలా ఉత్పత్తుల శాంపిళ్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యిందనీ, మూడు నాలుగు రోజుల్లోగా దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తుల తయారీ యూనిట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్ లలో పరీక్షించి.. వచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఎవరెస్ట్ మరియు MDH కంపెనీలు ఇంతవరకు ఈ విషయం పై బహిరంగంగా స్పందించలేదు.
-By VVA Prasad.