
నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థులు ఇప్పుడు UGC NET పరీక్ష రాయవచ్చు!
పీహెచ్డీ(PhD) ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(UG) ఉన్న విద్యార్థులు ఇకపై నేరుగా యూజీసీ నెట్(UGC NET) పరీక్ష రాయొచ్చని, తద్వారా వారు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్డీ చేయొచ్చని తెలిపింది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా.. లేకపోయినా… పీహెచ్డీ చేసేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉంటే చాలని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. SC/ST/OBC (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5% మార్కులు/గ్రేడ్లలో సడలింపు ఉంటుందన్నారు.
UGC NET (జూన్) సెషన్ పరీక్షలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగేళ్ల డిగ్రీ కోర్సు లేదా ఎనిమిదో సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్కు అప్లై చేసుకోవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. కాగా, ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి 55% మార్కులున్న వారిని మాత్రమే నెట్కు అర్హులుగా పరిగణించేవారు.
-By VVA Prasad