కలియుగ శబరి దీక్ష, త్రేతాయుగపు రాముడి మందిర (Rama Mandir) నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆనాటి శబరిలోని ఆత్మవిశ్వాసం, కౌసల్యా రాముడిని తన దగ్గరకు వద్దకు వచ్చేలా చేసింది అందుకోసం సుదీర్ఘ నిరీక్షణ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈనాటి శబరి మూడు దశాబ్దాల మౌన దీక్ష అయోధ్య మందిర నిర్మాణాన్నిభారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిందని చెప్పవచ్చు.

జార్ఖండుకు చెందిన సరస్వతీదేవి రాముడి పై తనకున్నపారవశ్యమైన భక్తినే పరీక్షగా పెట్టింది. ఆ విధంగా రాముడు అప్పటి త్రేతాయుగంలోనైనా, ఇప్పటి కలియుగంలోనైనా నిష్కల్మషమైన భక్తికి ముగ్దుడవుతాడని నిరూపించింది అపర శబరి ‘సరస్వతీదేవి’. ఈ కలియుగ శబరి 2024 జనవరి 22న అయోధ్యకు చేరి, తన 30 యేళ్ల భక్తి భావక మౌనవ్రతాన్ని, భక్తితో రామభద్రుని పాదపద్మాలకు సమర్పించనున్నది.
ప్రస్తుతం 85 యేళ్ళ వయస్సు లో వున్న ‘సరస్వతి అగర్వాల్’ జార్ఖండ్లోని ధన్బాద్ పరిధిలోని కరమౌండ్ నివాసి. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె ‘రామ్, సీతారాం’ అంటూ మౌన దీక్ష విరమించనుంది. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు రాముడు నన్ను ఆహ్వానించాడు.ఇకపై తన ఆజీవన పర్యంతం అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలియజేశారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె ఆనందంతో పరవశించిపోతున్నారు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది అని అన్నారు.
సరస్వతి అగర్వాల్ కు (Mauni Mata) అయోధ్యలో (Ayodhya) జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో సాదరంగా ఆహ్వానించారు. సరస్వతీదేవి ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. ఆమె వివాహం తర్వాత ఆమె భర్తనే ఆమెకు అక్షరబోధ చేశారు. సరస్వతీదేవి రామ చరిత మానసతో సహా ఇతర గ్రంథాలను చదివేవారు. రోజుకు ఒకసారి మాత్రమే సాత్విక ఆహారం తీసుకుంటారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఈవిడ భర్త దివంగతులయ్యారు. వీరికి ఎనమండుగురు సంతానం. తన మౌన దీక్ష సంకల్పానికి, తన సంతానమంతా సంతోషంగా సమ్మతించారు.
Mauni Mata గా ప్రసిద్ధి
రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ ను, సరస్వతి అగర్వాల్ 1992 మే నెలలో కలిశారు. అప్పుడు ఆయనకు రాముడి పట్ల తనకున్న భక్తి ప్రపత్తుల గురించి చర్చ జరిగింది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీర్వాదంతో ఆమె కమానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్ లో ఏడున్నర మాసాలు కల్పవాసంలో ఉండిపోయారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల కమానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. 1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యే దాకా మౌన వ్రతం వీడనని కఠోర దీక్షకు పూనుకున్నారు. అప్పటి నుంచి ఆవిడ మౌని మాత (Mauni Mata)గా ప్రసిద్ధి చెందారు.
-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist