
Nirbhay Cruise Missile విజయవంతం!
సుదూర శ్రేణి లక్ష్యాలను సాధించడానికి.. DRDO కొత్తగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని(Nirbhay Cruise Missile).. ఒడిశా తీరం, చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి గురువారం విజయవంతంగా పరీక్షించింది.
దీని గరిష్ట పరిధి 1500 కి.మీ. ఇది భూమి మీద 50 మీటర్ల ఎత్తు నుంచి గరిష్టంగా 4 కి.మీ ఎత్తు వరకు ప్రయాణిస్తున్న లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. దీనిని స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్, మానిక్ టర్బోఫాన్ ఇంజిన్ తో.. బెంగుళూరుకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లేబొరేటరీ – ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు.
ఈ క్షిపణి ప్రయాణ మార్గాన్ని వైమానిక దళానికి చెందిన Su-30-Mk-I విమానం నుంచి పర్యవేక్షించారు. ఈ క్షిపణి అనుకున్న విధంగా సరైన మార్గంలో ప్రయాణించింది. గంటకు 860 కి.మీ నుంచి 1111 కి.మీ వేగాన్ని సాధించింది. ఇది 300 కిలోల బరువు ఉన్న ఆయుధాలను మోసుకెళ్లగలదు.
టెస్టింగ్ సమయంలో రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం, టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. క్షిపణిలో అధునాతన ఏవియానిక్స్, సాఫ్ట్వేర్లను అమర్చారు. దీంతో అది దిశను మార్చుకుని కదిలే లక్ష్యాలను సైతం ధ్వంసం చేస్తుంది.
ఇది అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
-By VVA Prasad