
SB Organics కెమికల్ ఫ్యాక్టరీలో అదుపులోకి వచ్చిన మంటలు
హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ కెమికల్స్ కార్మాగారం రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు 90 శాతం వరకు అదుపులోకి వచ్చినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలంలో ఉండి మంటలు ఆర్పే పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులైన సుమారు 25 నుండి 30 మందిని MNR ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యలలో నిమగ్నమయ్యారని తెలిపారు.


SB ఆర్గానిక్(SB Organics) కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి(Reactor explosion) ఆరుగురు దుర్మరణం చెందిన సంగతి తెల్సిందే. ప్రమాద సమయంలో మృతదేహాలు వందల మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. రియాక్టర్ పేలడంతో మూడు భవనాలు కూడా కూలినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కంపెనీ డైరెక్టర్ రవిశర్మ, ప్రొడక్షన్ ఇంఛార్జ్లు సుబ్రహ్మణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ ఇంచార్జ్ సురేష్ పాల్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 25 నుండి 30 మంది క్షతగాత్రులైనట్లు తెలుస్తోంది
ఇక ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు.
-By VVA Prasad