చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
పరిశ్రమల వ్యాప్తి నేపథ్యంలో డ్రై పోర్టుల పై ప్రత్యేక ఫోకస్
సముచితంగా భూ నిర్వాసితులకు పరిహారం అందిస్తాం
లిడ్ క్యాప్ను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం.. పుణరుద్దరణకు ఇందిరమ్మ రాజ్యం చర్యలు
పరిశ్రమలు, ఐటి శాఖల సమీక్ష(Industries and IT Review)లో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. కొన్ని చిన్న, మధ్య తరగతి ఐటి కంపెనీలు , యానిమేషన్, గేమింగ్, విక్స్ఎఫ్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు.
Industries and IT Review
సోమవారం డా, అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులు ఆశాఖల పనితీరు విధానం గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ వార్షిక సంవత్సరంలో చేపట్టే కార్యాకలపాలకు కావాల్సిన నిధుల గురించి నివేదిక అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో డ్రై పోర్టుల ఏర్పాటుల పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతులు పెంచుకోవడానికి డ్రై పోర్టుల ఆవశ్యకత ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పరిశ్రమల భూ కేటాయింపులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి పరిహారం సముచితంగా ఇస్తామన్నారు.
లిడ్ క్యాప్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీనిని పునరుద్ధరణకు ఇందిరమ్మ రాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో లెదర్ పార్కల ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు కనెక్టివిటి పెరిగి రవాణా సమస్య లేకుండా ఉండటంతో పాటు ఆప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు. ఇండస్ట్రీయల్ పార్కులో పారిశ్రామిక వేత్తలకు చేసే భూ కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రాధన్యత ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం దీనిని విస్మరించిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉపాధి కల్పన పెంచడమే ప్రధానమైన ఆలోచనతోనే నూతన ఎం ఎస్ ఎం ఈ పాలసీని తీసుకురాబోతున్నట్లు వివరించారు. చిన్న స్థాయి నుంచి మధ్య స్థాయి ఉండే పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలంటే నూతన ఎంఎస్ఎంఈ పాలసీలో ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
దావోస్ పర్యటన లో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ఆరా తీశారని, అందుకనూ నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ లతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఆర్దిక స్వావలంబన తీసుకొస్తుందని వివరించారు. తొమ్మిది జిల్లాల్లో నూతనంగా ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. జి ఎస్ డి పీ లో పరిశ్రమల నుంచి 65శాతం ఆదాయం సమకూరుతున్నదని, పరిశ్రమలకు బడ్జెట్లో సముచితంగా నిధులు కేటాయిస్తే 75 శాతానికి పెంచుతామన్నారు.
తెలంగాణలోని ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించబోతున్నామని, ఇప్పటికే ఫైబర్ కేబుల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ , ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల ఉపయోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాల్లో ఏర్పాటు అవుతున్న ఐటి హబ్ ల్లో కంపెనీలను ఏర్పాటు చేసేల తోడ్పాటు అందిస్తామన్నారు. స్థానికంగా ఆసక్తి చూపుతున్న అక్కడి వాళ్ళకి కంపెనీలు ఏర్పాటు చేసేలా తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు.
సమావేశం(Industries and IT Review) లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎం.డి విష్ణువర్ధన్ రెడ్డి, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
-By C. Rambabu