• FCI కి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి..
• ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి.
• పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలి.
• జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.

జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (FCI) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, FCI అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్సిఐకి అందజేయాలని అన్నారు, పౌర సరఫరాల శాఖ నుండి ఎఫ్సిఐకి పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, అయితే డెలివరీలలో పని తీరు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారని వివరించారు.
Rice to FCI
పౌర సరఫరాల సంస్థ జనవరి 31 నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం బియ్యం యాసంగి సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరుగకూడాదని అధికారులను ఆదేశించారు. దీని కోసం తెలంగాణ మిల్లర్లందరూ రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు అవసరమైనంత నాణ్యతలో FCI కి బియ్యాన్ని పంపిణీ చేయడంపై ఆధారపడి ఉంటుందని జాప్యం జరిగితే కార్పొరేషన్కు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. గత 9-10 సంవత్సరాలలో రూ. 58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వలన సివిల్ సప్లైపై భారం పడిందని అన్నారు. ఆలస్యం చేయడం వలన అదనంగా దాదాపు రూ. 3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడనుందని అన్నారు. సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎఫ్సీఐకి నిర్ణీత పరిమాణంలో సీఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేయడంలో జాప్యం చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎఫ్సిఐకి సకాలంలో బియ్యం పంపిణీ చేసేందుకు విధానాలను మెరుగుపరచాలని, ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, రైతులకు, రాష్ట్ర ఆర్థిక మరియు పౌర సరఫరాల కార్పొరేషన్ యొక్క భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. లక్ష్యం గడువుకు 21 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, లక్ష్యాన్ని సాధించడానికి రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన ప్రతిపాదించారు.
పీడీఎస్ బియ్యం నాణ్యత పై మంత్రి ఆందోళన
దీనికి తోడు పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కిలో రూ.39కి కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైకిల్ చేయడం లేదా ఇతర అవసరాలకు మళ్లించడం జరుగుతోందని ఆయన గుర్తించారు. PDS బియ్యాన్ని “పవిత్రమైనది”గా పేర్కొంటూ, పేదలను చేరుకోవడంలో మరియు వాణిజ్యీకరణను నిరోధించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అధిక ధరలకు ఎగుమతి చేసేందుకు మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి రీసైక్లింగ్ చేస్తున్నారనే వార్తలను ప్రస్తావించగా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కేసులను అత్యంత సీరియస్గా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఒక్కో బియ్యం బస్తాకు 4-5 కిలోల తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేషన్ షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బియ్యం సరఫరా విషయంలో ప్రతి జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా CS శాంతి కుమారి మాట్లాడుతూ, తక్కువ కొనుగోళ్లు ఉన్న జిల్లాల్లోని కలెక్టర్లు FCI కి పంపిణీ చేసిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఆధార్, రేషన్ కార్డు లలోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. ప్రజాపాలనలోని అభయహస్తం దారఖాస్తులన్నింటి డాటా ఎంట్రీని ఈ నెల 17 వ తేదీ లోగా పూర్తి చేయాలన్నారు.
ప్రజాపాలన, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, డీ.ఎస్. చౌహాన్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
-By రాంబాబు.C