
September 17th as Hyderabad Liberation Day
ఓ వైపు అమిత్షా హైదరాబాద్ పర్యటన మరోవైపు లోక్సభ ఎన్నికల హడావిడి. ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ భారత్ లో విలీనం అయిన సెప్టెంబర్ 17ను అధికారికం చేసింది. ఇక నుంచి ఆ రోజును హైదరాబాద్ లిబరేషన్ డే(Hyderabad Liberation Day) గా నిర్వహించాలని కేంద్రం గెజిట్ జారీ చేసింది.

ఇకపై సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని దీన్ని స్వేచ్ఛకు గుర్తుగా ప్రజలను భాగస్వాములను చేయాలని ఎప్పటి నుంచో బీజేపీతో సహా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటూ వచ్చారు. ఏ పార్టీకి నచ్చినట్టు ఆ పార్టీ దీనికో పేరు పెట్టుకొని వేడుకలు చేస్తున్నాయి. కొందరు విలీన దినోత్సవం అంటే.. మరికొందరు విమోచన దినోత్సవం అంటారు. ఇంకొందరు విద్రోహ దినంగా చెబుతుంటారు.
తెరాస పార్టీ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు దాని ప్రస్తావనే తీసుకురాలేదు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం తప్ప అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు. ఇక ఇప్పుడు ఉరుముల్లేని పిడుగు లా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని కేంద్రం గెజిట్లో చేర్చింది. ఇకపై సెప్టెంబర్ 17 అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని పేర్కొంది.
ఇక గెజిట్లో ఏముంది అంటే….”భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్కు స్వాతంత్య్రం రాలేదు. 13 నెలల పాటు నిజాం పాలనలో ఉంది. ఆపరేషన్ పోలో(Operation Polo) కారణంగా 17 సెప్టెంబర్ 1948న నిజాం(Nizam) పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. అందుకే సెప్టెంబర్ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే అమరు వీరుల త్యాగలను, దేశభక్తిని యువతరానికి తెలియజేసేందుకు ఏటా ఇకపై హైదరాబాద్ లిబరేషన్ డే(Hyderabad Liberation Day) గా సెలబ్రేట్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.” అని గెజిట్ విడుదల చేసింది.