
Six Guarantees పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ గ్రామ సభల ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు ఓ రశీదు ఇస్తారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరణ పని పూర్తైన అనంతరం వారు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారని ఆయన వివరించారు
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే Six Guarantees చట్టబద్ధతను కేబినెట్ లో తీసుకొచ్చినట్లు చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూపించినట్లు పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ల సమావేశం అంటే కేవలం సీఎం చెప్పింది విని వెళ్లిపోయేవారని, కానీ ఈ సమావేశం అలా కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. గ్రామ సభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు.
‘ధరణి’ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, దీని ప్రక్షాళనకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎవరిపైనా కక్ష పూరిత చర్యలుండవని, తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టమని తేల్చిచెప్పారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారని, ప్రస్తుతం అమలవుతోన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల 58 శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేలా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
Six Guarantees
1.మహాలక్ష్మి: ఈ పథకం కింద తెలంగాణ మహిళలుకు
ప్రతి నెల ₹2,500
₹500కి గ్యాస్ సిలిండర్లు
RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
2.రైతు భరోసా: ఈ పథకం తెలంగాణ రైతుల కోసం. ఈ పథకం కింద
రైతులకు, కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు ₹15,000
వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి ₹12,000
వరి పంటకు సంవత్సరానికి ₹500 బోనస్
3.గృహ జ్యోతి:
ఈ పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది
4.ఇందిరమ్మ ఇండ్లు: ఈ పథకం కింద కాంగ్రెస్ వాగ్దానం ప్రకారం
తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 చదరపు గజాల ప్లాట్
ఇంటి స్థలం మరియు సొంత ఇల్లు లేని వ్యక్తులకు ₹5 లక్షలు
5.యువ వికాసం: ఈ పథకం రాష్ట్ర యువత కోసం
విద్యార్థుల కోసం ₹5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డ్
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
6.చేయూత
సీనియర్ సిటిజన్లకు ₹4,000 నెలవారీ పెన్షన్
రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద ₹10 లక్షలు