
TS Traffic Challan Discount- మరో ఐదు రోజులే
వాహనదారులకు పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపులకోసం ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ విధంగా రాయితీని గతంలో కూడా ఒకసారి ప్రకటించింది. అయితే ఈసారి రాయితీని గతంలోకంటే ఎక్కువ రాయితీని ప్రకటించడం విశేషం. చాలా మంది వారి పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో, ఆన్లైన్లలో చలాన్ల రుసుమును చెల్లించే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ ట్రాఫిక్ విభాగం. అయితే ఈ చెల్లింపులు చేయడానికి ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం మిగిలి వుంది. మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. మిగిలిన వాహనదారులు చలానాలు చెల్లించాలని పోలీసులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, చలానాలు విధిస్తున్నారు. ఈ చలానాలను చాలా మంది చెల్లించడం లేదు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించి, వాహనం నంబరు ఆధారంగా చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉన్నాయి.. అందుకే రాయితీ ప్రకటించారు.
వాహనదారుల నుంచి పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపులకు అనూహ్య స్పందన లభిస్తోంది. TS Traffic Challan చెల్లింపుల విషయమై రాయితీ ప్రకటించిన సమయానికి, ట్రాఫిక్ పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. చాలా కాలంగా లెక్కకు మించి పేరుకుపోయిన వీటన్నింటిని తగ్గించుకునే ఉద్దేశంతో, బైక్లు, ఆటోలకు 80%.. ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ మేరకు గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. వాహనదారులు పెద్దఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
TS Traffic Challan: సైబర్ నేరగాళ్ల మోసాలు
ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సైబర్ మాయగాళ్ల బారినపడకుండా ఉండేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఢిల్లీలో ఇదే తరహాలో వాహనదారుల నుంచి సొమ్ము కొట్టేసిన సైబర్ ముఠాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
కాగా జనవరి 10వ తేదీ వరకు మాత్రమే చలానాలపై డిస్కౌంట్కు అవకాశం ఉందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరస్థులు నకిలీ వెబ్సైట్తో వాహనదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సాప్) నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.
TS Traffic Challan: Official website
కేవలం అక్షరం మార్పుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి సోషల్ మీడియా, మొబైల్ నంబర్లకు లింకులు పంపుతున్నారు. ఇది నిజమని భావించిన వాహనదారులు నగదు చెల్లించగానే.. అట్నుంచి డబ్బులు జమ చేసినట్టు ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. పోలీసుల వెబ్సైట్లో పరిశీలిస్తే చలానాలు యథావిధిగా కనిపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండేందుకు వాహనదారులు మీ-సేవ కేంద్రాలు, పేటీఎం వాలెట్, https://echallan.tspolice.gov.in/publicview/ ద్వారా చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.
-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist