
Kuppam సభలో జగన్ నిప్పులు పై చెరిగిన బాబు
కుప్పం : ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని మీరే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చేది కుప్పం(Kuppam) లోనే అని టిడిపి(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూసైకిల్ కి తప్ప మరో పార్టీకి ఓటెయ్యడం తెలియని బంగారు కుప్పం మనదని అన్నారు. కొంతమంది నేతలు కులం, మతం ఎక్కవ ఓట్లను చూసి నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారు. కానీ నేను పేదలు ఎక్కడున్నారా అని వెతుక్కుని కుప్పానికి వచ్చాను. పేదలు, బడుగు బలహీన వర్గాలే నాకు సర్వశ్వం. నేను ఇప్పటివరకూ 7 ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేశా. ఎన్నికలు వస్తున్నాయి…ప్రజల్లోకి వెళ్లే ముందు మీ ఆశీస్సులు కోరేందుకే ఇక్కడికి వచ్చాని చెప్పారు.
ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. కుప్పం ప్రజలను చూస్తే…ఎన్నికల కళ కనిపిస్తోంది ఆనందం వ్యక్తం చేశారు. కుప్పం(Kuppam) అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీకి డిపాజిట్లు కూడా ఇవ్వొద్దు అనే కసి మీలో కనిపిస్తోందని అన్నారు. పేదలకు అన్నం పెట్టేందుకు కుప్పంలో పెట్టిన అన్నాక్యాంటీన్ రద్దు చేశారంటే వీళ్లు మనుషులా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాల చేసి కుప్పి గంతులు వేసే వాళ్లకు ఇదే నా హెచ్చరిక. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆటలు ఆడారు. ఇక కోడ్ వచ్చింది…మీకూ పోలీసులు లేరు…మాకూ పోలీసులు లేరు. ఈసీ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాల్సిందనని గుర్తు చేశారు.


పుంగనూరు నుంచి ఓ దోపిడీదారు వస్తాడు. కప్పం కట్టించుకోడానికి కుప్పం వస్తాడు. ఆ దోపిడీదారుడు దోచిందంతా కక్కిస్తా. మాజీ సీఎంగా, ప్రతిపక్షనేతగా నా నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అక్రమ కేసులు బనాయించారు. నాపై రౌడీయిజం చేశారు. గౌనివారి శ్రీనివాసులు సహా అందర్నీ జైల్లో పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కుప్పం(Kuppam)లో చోటా మోటా రౌడీలకు ఇదే నా హెచ్చరిక. ఎన్నికలు సరిగా జరక్కుండా అడ్డుపడితే మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కుప్పం ప్రజలు కాపాడాలని కోరారు కుప్పానికి హంద్రినీవా నీళ్లు అంటూ సైకో సీఎం హడావుడి చేశాడు. వచ్చాయా నీళ్లు డ్రామాలాడతావా…సినిమా సెట్టింగులు వేస్తావా. సీఎం వెళ్లాడు గేట్లు ఎత్తేశారు. జలగా నీళ్లేవి అంటూ మన తమ్ముళ్లు నిరసన తెలిపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నేను సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చా. 90 శాతం హంద్రినీవా పూర్తిచేశా.. 5 ఏళ్లు అధికారంలో ఉండి 10 శాతం పనులు పూర్తి చేయలేక పోయిన దద్దమ్మ, చవటలు మీరు…నన్నా మీరు విమర్శించేది అధికారంలోకి రాగానే హంద్రినీవా నీళ్లు తెచ్చి కుప్పానికి నీరిస్తా..చెరువులన్నీ నింపుతాం అన్నారు. కుప్పం నియోజకవర్గానికి జగన్ తీరని అన్యాయం చేశారు.ఎప్పుడూ లేని విధంగా హింసా, దాడులు, కబ్జాలు, గ్రానైట్ మాఫియా వచ్చింది. శాంతిపురంలో కేజీఎఫ్ మాదిరి మొత్తం తవ్వేశారు. నేను ఫిర్యాదు చేస్తే రెండు రోజులు మౌనంగా ఉండి మళ్లీ గ్రానైట్ దోపిడీ మొదలెట్టారు. చివరకు ఆడపిల్లలపైనా అక్రమ కేసులు బనాయించారు. మా కార్యకర్తలను జైలుకు పంపారు. ఎదీ మర్చిపోను. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.
నన్ను ఓడిస్తామని, వై నాట్ కుప్పం(Kuppam) అని కొందరు సైకోలు కుప్పిగంతులు వేశారు. నన్ను ఓడించడం వారి వల్ల కాదు…నేను అంటున్నా వై నాట్ పులివెందుల.? జగన్ నీకు ఓటెందుకు వేయాలి? బాబాయిని గొడ్డలికి బలిచేసినందుకా…రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినందుకా? కుప్పం(Kuppam) నుంచే నేను ఎన్నికల శంఖారావంగా ప్రజాగళం మోగిస్తున్నా…ఈ తుపాను తీవ్ర వాయుగుండంగా మారి వైసీపీ నేతలు బంగాళాఖాతంలో కలిసిపోతారని అన్నారు. మే 13న ఉధృతంగా గాలివీయాలి. చెట్టూ, పుట్టా , గట్టూ మొత్తం సైకిల్ అనే మోత మోగాలి. ఫ్యాన్ చిత్తుచిత్తుగా ఓడిపోవాలి. 175 నియోజకవర్గాల్లో కూటమి గెలవాలి. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు, బాదుడే బాదుడును ప్రజలు భరించారు. అందరూ నష్టపోయారు. నాతో సహా అందరూ బాధితులయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు.
సీఎం సొంత నియోజకవర్గం కడప ఒంటిమిట్టలో చేనేత వర్గానికి చెందిన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నారు. నేను సీఎంగా ఉండగా ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశాను. అక్కడ భూముల రేట్లు పెరిగాయి. దీంతో అక్కడి చేనేత కార్మికుడి భూములపై వైసీపీ నేతల కన్ను పడింది. రికార్డులు మార్చేసి ఆక్రమించారు. తట్టుకోలేని ఆ కుటుంబం ప్రాణాలు తీసుకుంది. విశాఖలో గన్ పెట్టి ఎన్ఆర్ఐ సొంత భూమి రాసివ్వమన్నారు. ఎందుకివ్వాలని ప్రశ్నించినందుకు వేధించారు. రికార్డులు మార్చారు. ఐదేళ్లుగా ఆయన పోరాడుతూనే ఉన్నాడు. సొంత భూమి కాపాడుకోడానికి కోట్లు ఖర్చు పెట్టాలా అని ప్రశ్నించారు.
తిరుపతిలోనూ ఎన్ఆర్ఐ డాక్టర్ సునీత భూమి కొంటే వైసీపీ నేతలు ఆ భూమి ఆక్రమించారు. ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఈ భూమి నీది కాదన్నారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆవేదనతో వీడియో పెట్టింది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అక్రమాలకు అడ్డే లేదు. జనార్థన్ నాయుడుకు చెందిన గ్రానైట్ క్వారీని బలవంతంగా రాయించుకున్నాడు. రూ.35 లక్షల కరెంట్ బిల్లు వస్తే…అది కూడా జనార్థన్ నాయుడుని కట్టాలని బెదిరించాడు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ భార్యతో రైలు కింద పడి చనిపోయాడు. ఇలాంటి ఘటనలు ఊరూరా జరుగుతున్నాయి. జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్ తరలించారు. ఈ వ్యవహారంతో వైసీపీ నేతలకు లింకులున్నాయి. డ్రగ్స్ ను అరికట్టకపోతే యువత భవిష్యత్ నిర్వీర్యమైపోతుంది. కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ చేస్తున్నా. మన నియోజకవర్గంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తా…మహిళలకు ఉపాధి కల్పిస్తా. ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సొంతిళ్లు ఇస్తాం. జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, చిరు వ్యాపారులు, టీచర్లు, పేద- మధ్య తరగతి వర్గాలకు సరసమైన ధరలకే భూములు ఇస్తాను. ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలను చేస్తా. కుప్పాన్ని అభివృద్ధి చేసింది నేనే….జగన్ రెడ్డి కేవలం గాడిదలకు పళ్లు మాత్రమే తోమాడు. కుప్పాన్ని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్ గా తయారుచేస్తా. కుప్పం పచ్చని సుందర ప్రాంతం. ప్రకృతినీ వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు వైసీపీ కేటుగాళ్లు. కనీసం ఏనుగులను కట్టడి చేయలేని దద్దమ్మలు. కంచె వేయలేరా? ప్రజలను ఏనుగులకు అప్పగిస్తారా? అని ధ్వజమెత్తారు.
గంగమ్మ గుడి గోపురం రాతితో కట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పవిత్ర కార్యం నాతోనే ప్రారంభం అవుతుంది. ప్రతిఒక్కరూ టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్థులకే ఓటేయండి. ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాలనే పొత్తు పెట్టుకున్నాం. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అన్నదే నా అజెండా. 30 ఏళ్ల వెనక్కు నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని చెప్పారు.
కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 160పైగా ఎమ్మెల్యేలు మనం గెలవాలి. 24 ఎంపీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ మీ ఇంటికే వచ్చేలా చేస్తాం. బయటకు వెళ్లిన వారు రెండు నెలలు ఊర్లో లేకపోతే వారికీ పెన్షన్ ఇస్తాం. మన పాలనలో వ్యవస్థలపై దాడులు ఉండవు…భరోసా, భద్రత ఎన్డీయేతోనే సాధ్యం అని కుప్పం(Kuppam) సభలో బాబు అన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist