
తెలుగుదేశం జనసేన బిజెపి కలయిక అపవిత్రమైనది -Mopidevi
రేపల్లె: రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు రాను రాను కనుమరుగు అవుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు(Mopidevi Ramana Rao) విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన బిజెపి కలయికను అపవిత్రమైనదిగా అభివర్ణించారు.
మండలంలోని రాజు కాల్వ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మోపిదేవి(Mopidevi) ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బిజెపి టిడిపి పొత్తులపై ఫైరయ్యారు. నిన్న మొన్నటి వరకు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్న టిడిపి, బిజెపి పార్టీలు నేడు కలిసి కాపురం చేయటం అపవిత్రకరమన్నారు.
2014 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు చేతిలో పెడతామని చెప్పిన బిజెపి పెద్దలు ప్రత్యేక హోదా ఇవ్వటములో విఫలమయ్యారని Mopidevi దుయ్యబట్టారు. ఆనాడు ఆ మాట, మధ్యలో విడాకులు తీసుకొని ప్రస్తుతం కలిసి కాపురం చేయటం విచారకరమన్నారు. రాజకీయాలలో ప్రజలు స్వాగతించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలలో ఉన్నవారు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చురక లంటించారు.
ప్రస్తుత రాజకీయాలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన స్థాయిని రోజురోజుకు దిగదా దిగజార్చు కుంటున్నారని అన్నారు. ఆ సామాజిక వర్గ ప్రజల ఆశలపై నీళ్లు చల్లే విధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబును(Chandra Babu) ముఖ్యమంత్రి చెయ్యలనటం హాస్యాస్పదం అన్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక విలువలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. మొదట 40 సీట్లు అడిగిన పవన్ కళ్యాణ్ తర్వాత 24 సీట్లకు పరిమితం అయ్యారని, నేడు 21 సీట్లు తీసుకోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.
రాష్ట్రంలో సిద్దం సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం సిద్ధం సభల విజయవంతం అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి శరణ్యం అనే రీతిలో సిద్ధం సభలో విజయ వంతమయ్యాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో ఎక్కడ సరైన అవకాశాలు లభించవనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలైన టిడిపి జనసేన బిజెపి పొత్తులు పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం బిజెపి పొత్తులను ప్రజలు అసహ్యించు కుంటున్నారని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో టిడిపి జనసేన శ్రేణులు రెచ్చిపోయి ఆమెను ట్రోల్స్ చేయటం తో ఆత్మహత్యకు పాల్పడిందని ఇది సభ్య సమాజం తలదించుకునే చర్య అన్నారు. ఈ విధంగా ప్రతిపక్షాలు ప్రవర్తించడం విచారకరం అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అనంతరం రేపల్లె(Repalle) రూరల్ మండలంలో ఐదు కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో తాగునీటికి జల్జీవన్ మిషన్ పథకం క్రింద రెండు కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. సిసి రోడ్లు ఆరోగ్య కేంద్రాలు ఆర్ బి కే లు నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు, ఇన్చార్జి డాక్టర్ ఈవూర్ గణేష్, పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి రూరల్ అధ్యక్షులు గాదె వెంకయ్య బాబు మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist